యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఐతే, ‘థగ్ లైఫ్’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దర్శకుడు మణిరత్నం ఈ విషయంలో ఆడియన్స్కు క్షమాపణలు చెప్పడం విశేషం. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘థగ్ లైఫ్’ ఫలితంపై మణిరత్నం స్పందిస్తూ.. ‘మా ఇద్దరి నుంచి మరో ‘నాయకుడు’ను ఆశించిన వారికి నేను చెప్పగలిగేది ఒక్కటే. మమ్మల్ని క్షమించండి. ఆ సినిమా కంటే తక్కువ దాన్ని చేయడం మా ఉద్దేశం కాదు’ అంటూ మణిరత్నం తెలిపారు.
మణిరత్నం ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి మేం పూర్తిగా భిన్నమైన సినిమాని అందించాలనుకున్నాం. కానీ, మా నుంచి ప్రేక్షకులు ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడంతో అనుకోని ఫలితాన్ని అందుకున్నాం. మేము అందించిన దానికంటే ఆడియన్స్ భిన్నంగా కోరుకున్నారని అర్థం చేసుకున్నా’’ అని మణిరత్నం చెప్పుకొచ్చారు. ‘నాయకుడు’ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. దాదాపు 37 ఏళ్ల తర్వాత మణిరత్నం – కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ ప్లాప్ అయింది.