బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి.వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ‘మిత్ర మండలి’ టీజర్ ను నిర్మాతలు విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేశారు.
టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “బన్నీ వాసు సమర్పిస్తున్న మొదటి సినిమాగా, నా మిత్రులందరూ కలిసి తీసిన ఈ ‘మిత్ర మండలి’ టీజర్ ను లాంచ్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను యంగ్స్టర్స్ తో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటాను. దాని వల్ల స్క్రిప్ట్ ఎంపిక వంటి విషయాల్లో ఎంతో హెల్ప్ జరుగుతుంటుంది. ఒకసారి వాసు ఈ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించాడు. కానీ, మీ ముందు కథ చెప్పలేకపోతున్నాను అని దర్శకుడు వెళ్ళిపోయాడు. ప్రియదర్శి మాకు ఒక వెబ్ సిరీస్ చేశాడు. అప్పుడే అనిపించింది.. ఇతను మంచి స్థాయికి వెళ్తాడని. యాక్టర్ గా ఎంత చేయాలో, ఎంత చేయకూడదో తెలిసిన మనిషి. కోర్ట్ సినిమాలో అద్భుతంగా నటించాడు. సోషల్ మీడియాలో నిహారికకు మంచి ఫాలోయింగ్ ఉంది. తనకి ఆల్ ది బెస్ట్. నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. టీజర్ చాలా బాగుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకంటూ, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్.” అన్నారు.
నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. “ఏ హోమం చేసినా మనం ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. మా సినిమా వేడుకలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే. నన్ను, బన్నీ వాసుని ఆయన బిడ్డల్లాగే చూసుకుంటారు. చేతి ఐదు వేళ్ళు విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ, కలిసే ఉంటాయి. అరవింద్ గారు ప్రోత్సహించిన కుటుంబం మేము. మేమంతా ఎప్పుడూ కలిసే ఉంటాం. ఆయన కోసం మేము పిడికిలిగా మారడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఈ మిత్ర మండలి టీజర్ చూస్తుంటే జాతి రత్నాలు, మ్యాడ్, ఆయ్, సింగిల్ సినిమాల వైబ్ వస్తుంది. అవన్నీ హిట్ సినిమాలే. మిత్ర మండలి వాటిని మించిన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
చిత్ర సమర్పకులు, నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. “ఒక నలుగురు కుర్రాళ్ళు కలిసి చేసే బడ్డీ కామెడీ ఎలా ఉంటుందో.. మిత్ర మండలి అలా ఉంటుంది. ఇలాంటి సినిమా తీయడానికి ‘జాతిరత్నాలు’ స్ఫూర్తి. ఒక నలుగురు స్నేహితులు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడితే చూడటానికి ఎంత బాగుంటుంది. ఇది యంగ్ స్టర్స్ అంతా కలిసి తీసిన సినిమా. మేము వాళ్ళకి మా వంతు సపోర్ట్ ఇచ్చాము. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక అందరూ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ – సత్య ట్రాక్ అదిరిపోతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. థియేటర్లకు వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి. ఈ సందర్భంగా అరవింద్ గారికి, అనుదీప్ గారికి, మిత్రుడు ఎస్.కె.ఎన్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు. అల్లు అరవింద్ గారు మాకు గాడ్ ఫాదర్ లాంటివారు. ఆయన చేతుల మీదుగా టీజర్ లాంచ్ జరగడం సంతోషంగా ఉంది. నా లైఫ్ లో మా తల్లిదండ్రులు కంటే కూడా అరవింద్ గారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఆయన వల్లే మేము ఎదిగాము. సినీ పరిశ్రమలో నేను ఏం సాధించినా దానికి అరవింద్ గారికే కారణం.” అన్నారు.
చిత్ర దర్శకుడు విజయేందర్ ఎస్ మాట్లాడుతూ.. “మా టీజర్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన అల్లు అరవింద్ గారికి, నా మిత్రుడు అనుదీప్ కి, అందరికీ నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుంది. నేను రాసిన కామెడీని నటీనటులంతా తెరమీద అద్భుతంగా పండించారు.” అన్నారు.