మెగా హీరో సాయి తేజ్ చేసున్న కొత్త చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇన్నాళ్లు యూత్ ఫుల్ ఎంటెర్టైనర్లు చేస్తూ వచ్చిన సాయి తేజ్ మొదటిసారి చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా మీద తాను చాలా ఆసక్తిగా ఉన్నట్టు, దేవ కట్ట కథను చాలా బాగా రాసినట్టు తేజ్ చెప్పుకొచ్చారు. రిపబ్లిక్ డే సందర్బంగా విడుదలైన మోషన్ పోస్టర్ కూడ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు, శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’ అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ సినిమా మీద మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. తాజాగా చిత్రం బృందం ఈ సినిమాను జూన్ 4వ తేదీన విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటి రమ్యకృష్ణ ఒక కీ రోల్ చేస్తుండగా ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది.