రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో సినిమా ఉంటుందనే వార్తలు చాలారోజుల నుండే హడావుడి చేస్తున్నాయి. కానీ వీటిని చాలామంది ఒత్తి పుకార్లనే అనుకున్నారు. ఇటు చరణ్, అటు శంకర్ ఎవరి నుండీ చిన్నపాటి లీక్ కూడ రాకపోవడం, శంకర్ ‘ఇండియన్ 2’లో బిజీగా ఉండటం చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో ఉండటంతో ఇది ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే కాంబినేషన్ కాదనుకున్న చాలామంది. కానీ వీరి కలయిక కుదిరింది. సినిమాను కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు, శిరీష్ ఈ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించనున్నారు. శంకర్ సినిమా అంటేనే భారీ బడ్జెట్ అని ఇట్టే అర్థమైపోతుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ చేయనున్న సినిమా కాబట్టి ఇది పాన్ ఇండియా సినిమానే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మాట్లాడుతూ మా బ్యానర్లో నిర్మిస్తున్న 50వ సినిమా ఇలా సెట్టవ్వడం ఆనందంగా ఉందని, దక్షిణాది సినిమా స్థాయిని ఇటు సబ్జెక్ట్ పరంగా, అటు సాంకేతికంగా వేరే స్థాయికి తీసుకెళ్లిన భారీ చిత్రాల సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో సినిమాను నిర్మించనున్నాం అన్నారు. ఇకపోతే ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.