ఈ ఏడాది అనుకోకుండా వచ్చిన అతిధి కరోనా వల్ల మన దేశపు యావత్ సినీ పరిశ్రమకు భారీ నష్టం చేకూరింది. దీనితో ఎన్నో భారీ చిత్రాల షూటింగులు మరియు ఎన్నో చిత్రాల విడుదల ఆగిపోయాయి. కానీ ఇదే అలా కొనసాగితే పరిణామాలు ఎటు వెళ్లి ఆగుతాయో అని ఆలోచించి కేంద్రం పలు ఆంక్షలతో లాక్ డౌన్ ను దశల వారీగా ఉప సంహరిస్తున్నారు.
అలా ఇప్పుడు అన్లాక్ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా సినిమాలు, టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం వారు అనుమతిని ఇచ్చారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా చిత్రీకరణలు జరుపుకోవచ్చని తెలిపింది. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆదివారం ఉదయం ఓ ప్రకటనలో చిత్రీకరణలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
కేంద్రం ఇచ్చిన మార్గ దర్శకాలు ఇవే..
1. బహిరంగ ప్రదేశాల్లో యూనిట్ సిబ్బంది మొత్తం ఫేస్ మాస్క్లు తప్పనిసరిగా ఉపయోగించి తీరాలి.
2. ఆరోగ్య సేతు యాప్ను నటీనటులంతా తప్పకుండా ఉపయోగించాలి.
3. షూటింగ్ సమయాల్లో విజిటర్లను అనుమతించవద్దు.
4. మేకప్ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.
5. సాధ్యమైనంత తక్కువ మంది సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చూడాలి.
6. థియేటర్లలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేయాలి.
7. టికెట్లు ఆన్లైన్లో మాత్రమే విక్రయించాలి.
8. షూటింగ్ పాయింట్ వద్ద సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలి.
9. చిత్రీకరణ జరిపే ప్రాంతంలో తాత్కాలిక ఐసోలేషన్ కేంద్రం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.