దక్షిణ సినిమా ప్రముఖ నటులలో ఒకరైన నటుడు విశాల్ ఇటీవల ‘మధ గజ రాజా’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆ చిత్రం విజయం తర్వాత విశాల్ ఇప్పుడు తన 35వ చిత్రాన్ని ప్రారంభించారు. దీనిని ప్రముఖ నిర్మాత RB చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. RB చౌదరి 1990లో ‘పుదు వసంతం’ చిత్రంతో సూపర్ గుడ్ ఫిల్మ్స్ను ప్రారంభించారు. అప్పటి నుండి ఈ బ్యానర్ అనేక విజయవంతమైన చిత్రాలను అందించింది. తమిళ, తెలుగు సినిమాకు అనేక మంది కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రస్తుతం విశాల్తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్కి 99వ చిత్రం.
ఈ కొత్త చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. నటుడు విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో ఇది మొదటి చిత్రం. ముఖ్యంగా ‘మధ గజ రాజా’ చిత్రం ఘన విజయం తర్వాత విశాల్ మరోసారి సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్తో జతకట్టడం విశేషం. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్గా పని చేయనున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మార్క్ ఆంటోనీ విజయం తర్వాత సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ మరోసారి ఈ చిత్రానికి విశాల్తో కలిసి పనిచేస్తున్నారు. నటి దుషార విజయన్ విశాల్ సరసన కథానాయికగా నటించనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు (జూలై 14) ఉదయం చెన్నైలో అట్టహాసంగా జరిగింది. దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య (సిటిజన్), మణిమారన్ (NH4), వెంకట్ మోహన్ (అయోగ్య), శరవణన్ (ఎంగేయుమ్ ఎప్పోదుం), నటులు కార్తీ, జీవా, డిఓపి ఆర్థర్ ఎ విల్సన్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. చెన్నైలో చిత్రీకరణ ప్రారంభించి 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ను పూర్తి చేయనున్నారు.