ఈ ఏడాది ఊహించని విధంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిపోయిన అనేక పరిశ్రమలలో సినీ పరిశ్రమ కూడా ఒకటి. దీనితో షూటింగ్స్ ఆగిపోయి జీవనోపాధి లేక ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న నిత్య వేతన కార్మికులు కోసం మెగాస్టార్ చిరంజీవి అందరికీ పిలుపునిస్తూ ప్రారంభించిన చారిటీ కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ).
దీనితో వేలాది మంది సినీ కార్మికులకు అండగా నిలిచారు.ఇంకా ఉపాధి లేనందున సీసీసీ ద్వారా మరోసారి అవసరమైన కార్మికులకు నిత్యావసరాల్ని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి అన్ని అసోసియేన్ల ద్వారా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.
దీనిపై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-“నిత్యావసర వస్తువులను తిరిగి పంపిణీ చేయాల్సిన పరిస్థితులున్నాయి. ఇంకా షూటింగులు మొదలుకాలేదు. అందువల్ల ఎవరికీ పనిలేదు. ఇంకా లాక్డౌన్ పరిస్థితులే కొనసాగుతున్నాయి. అందుకే అందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వాలని సీసీసీ కమిటీలో నిర్ణయించామని. ఇదివరకూ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
ఎవరూ బయటకు రాలేదు కాబట్టి, సీసీసీ వాలంటీర్ల ద్వారా ఇళ్లకే వస్తువులను పంపిణీ చేశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నేను స్వయంగా టెస్ట్ చేశాను. టేస్ట్ చేశాను. అందరూ పొదుపుగా వాడుకోండి. మళ్లీ పనులు ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానాన్ని త్వరలోనే వింటాం.
తనకి కూడా పని లేక విసుగ్గా ఉంది, బోర్ కొడుతోంది. అందరి పరిస్థితిని అర్థం చేసుకోగలను. త్వరలో కరోనా మహమ్మారిని అధిగమిద్దాం. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోండి. పని ముఖ్యమే. ప్రాణం అంతకన్నా ముఖ్యం. పెద్దలను, చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఎవరూ అధైర్యపడవద్దు. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. మళ్లీ అందరం చేతినిండా పనితో ఉంటాం. ఎప్పుడూ సీసీసీ కార్మికులకు అండగా ఉంటుంది“ అని చిరు తెలిపారు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని తన వంతు సాయం అందించిన ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ-“లాక్ డౌన్లో షూటింగ్ లేని కారణంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సినిమా కార్మికులకు అండగా ఉండాలనే గొప్ప సంకల్పంతో చిరంజీవిగారు సీసీసీ మనకోసం ప్రారంభించారు . చిరంజీవి గారి ఆలోచనకు బలాన్నిస్తూ హీరోలు నిర్మాతలు దర్శకులు తమ వంతు విరాళాలిచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు అని.
మొదటి విడతగా 13 వేల మంది కార్మికులకు ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను వారి ఇళ్లకే చేర్చడం జరిగింది సినిమాయే జీవనోపాధిగా ఉన్న కార్మికులు తమ ఇంటికి సరుకులు అందించిన త్రిబుల్ సీ మనకోసం కమిటీ సభ్యులను చిరంజీవి గారిని అభినందించడం జరిగింది.
రెండో విడత పంపిణీ చేయడానికి ముందు జరిగిన రివ్యూ మీటింగ్ లో మొదట విడత సహాయాన్ని ఆర్థికంగా బాగున్నవారు కూడా తీసుకున్నారని గుర్తించడం జరిగింది అందులో భాగంగా కమిటీ తరఫున తమ్మారెడ్డి భరద్వాజగారు ఆయా కార్మిక నాయకులతో మాట్లాడటం జరిగింది ఆ సంఘ నాయకులు నిబద్ధతతో నిజంగా అవసరం ఉన్న తమ కార్మికుల లిస్టుని కమిటీకి అందజేయడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా ఆ నాయకులను అభినందిస్తూ రెండోసారి ఇవ్వడానికి సమాయత్తమైంది.
నిజంగా అవసరం ఉన్న సభ్యులు మాత్రం తీసుకోవడం వలన అవసరమైతే మూడో విడత కూడా పేద కార్మికులకు అందించాలని ఒక ఆలోచన చిరంజీవి గారికి కలిగి వీడియో మెసేజ్ ద్వారా ఆ ఆయా సంఘాలిచ్చిన లిస్టుల ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా అందించాలని ఆ కార్మిక నాయకులకు పూర్తి బాధ్యతను అప్పగిస్తూ ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది..
అలా గురువారం నుంచి పంపిణీ కార్యక్రమాన్ని దాదాపు పది కార్మిక సంఘాలు మొదలుపెట్టాయి. ఈసారి అదనంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న సినిమా రిప్రజెంటేటివ్స్ కు మరియు పోస్టర్స్ పేస్టింగ్ చేసే కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది . నిత్యవసర సరుకులు అవసరం లేని వారు తీసుకోవద్దని అవసరం ఉన్నవారు మాత్రమే తీసుకుంటే బాగుంటుందని సిసిసి కమిటీ విజ్ఞప్తి చేసింది అని ఆయన తెలిపారు.