ఈ సినిమా ఇరవై ఏళ్ల పాటు గుర్తుంటుంది – కల్యాణ్‌ రామ్‌

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి”. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘‘కర్తవ్యం’లో వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. ప్రదీప్‌ ఈ కథతో నావద్దకు వచ్చినప్పుడు ‘అమ్మ (విజయ శాంతి) అంగీకరిస్తారా?’ అని అడిగాను. అమ్మ అంగీకరించకుండా చేయడం కరెక్ట్‌ కాదేమోననిపించింది. ఈ సినిమాకు బిగ్గెస్ట్‌ పిల్లర్‌ అమ్మ. ఈ వయసులోనూ ఆమె ఎలాంటి డూప్స్‌ లేకుండా స్టంట్స్‌ అద్భుతంగా చేశారు’ అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

కళ్యాణ్ రామ్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పృథ్వీ చాలా ముఖ్యమైన పాత్ర చేశారు. ‘యానిమల్‌’తో తనకు బాలీవుడ్‌లో ఎంత గుర్తింపువచ్చిందో తెలుగులో ఈ సినిమాతో వస్తుందని తను బాగా నమ్మారు. ఈ సినిమాకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. నేను నటించిన ‘అతనొక్కడే’ విడుదలై 20 ఏళ్లు అయినా ప్రేక్షకులకు గుర్తుంది. అదేవిధంగా ఈ సినిమా కూడా ఇరవై ఏళ్ల పాటు గుర్తుంటుంది’’ అని కల్యాణ్‌ రామ్‌ తెలిపారు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా అశోక క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

Exit mobile version