ఛాంపియన్స్ ట్రోఫీ కప్‌కు అడుగు దూరంలో భారత్

క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భారత్ తన జోరును కొనసాగిస్తుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత జట్టు తొలి సెమీస్‌లో నేడు ఆస్ట్రేలియాతో ఢీకొంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్‌తో పరుగులు చేస్తూ దూకుడుగా ఆడింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (73), అలెక్స్ క్యేరీ (61), ట్రావిస్ హెడ్ (39) పరుగులతా రాణించారు. అయితే భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. దీంతో 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆసీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. 265 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది.

లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లలో శుభ్‌మాన్ గిల్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో 28 పరుగులకు ఔటయ్యాడు. ఇక మిడిలార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ ఐయర్‌తో కలిసి విరాట్ లక్ష్యాన్ని ఛేదించే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో శ్రేయాస్ (45), విరాట్ కోహ్లీ (84) పరుగులకు ఔట్ అయ్యారు. అయితే, చివర్లో కెఎల్ రాహుల్ (42), హార్ధిక్ పాండ్యా(28) మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.

Exit mobile version