‘మోతెవరి లవ్‌స్టోరి’ సిరీస్ పెద్ద విజయాన్ని సాధించాలి – ఆనంద్ దేవరకొండ

‘మోతెవరి లవ్‌స్టోరి’ సిరీస్ పెద్ద విజయాన్ని సాధించాలి – ఆనంద్ దేవరకొండ

Published on Jul 9, 2025 4:30 PM IST

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ రాబోతోంది. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్‌ను సహజంగా రూపొందించారు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోంది. విలేజ్ షో మూవీస్ ఆధ్వర్యంలో తీసిన ఈ సిరీస్‌లో అనేక ట్విస్టులు ఉండబోతోన్నాయి. ఒక పెళ్లి చుట్టూ జరిగే డ్రామా అందరినీ ఈ సిరీస్‌లో ఆకట్టుకోనుంది. జూలై 9న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. నటుడు ఆనంద్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హాజరై పోస్టర్, టైటిల్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా.. చిన్న సిరీస్, పెద్ద సిరీస్ అని అనడం నాకు నచ్చదు. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే టైటిల్, పోస్టర్ చాలా కొత్తగా ఉంది. నాకు ఇలా ఈవెంట్లకు రావడం కాస్త భయం. కానీ అనిల్ పిలిచిన వెంటనే రావాలని అనిపించింది. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడి వారు మై విలేజ్ షో కంటెంట్‌ను చూసేవాళ్లు. నేను కూడా ఫాలో అయ్యేవాడ్ని. మధుర శ్రీధర్ గారు నా దొరసాని సినిమాను నిర్మించి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ మూవీకి మై విలేజ్ షో కంటెంట్ చూసే డైలాగ్స్, యాసను నేర్చుకున్నాను. నా జర్నీలో మై విలేజ్ షో టీం పాత్ర చాలా ఉంది. ఈ సిరీస్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ పెద్ద సక్సెస్ రావాలి. ఈ సిరీస్‌కు సీక్వెల్స్ వస్తూనే ఉండాలి. సక్సెస్ అవుతూనే ఉండాలి’ అని అన్నారు.

జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ మాట్లాడుతూ ..‘కరోనా టైంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చూసి ఆశ్చర్యపోయాను. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. వెంటనే ఆ మూవీ రైట్స్‌ను మేం కొనేశాం. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో సంగీత్ శోభన్‌కు స్టార్డం వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌తో అనిల్ గీలాకు స్టార్డం వస్తుంది. మై విలేజ్ షో టీంతో అసోసియేట్ అవ్వడం, మధుర శ్రీధర్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. గ్రామీణ రొమాంటిక్-కామెడీగా తెరకెక్కిన ఈ సిరీస్ అందరినీ మెప్పిస్తుంది’ అని అన్నారు.

జీ5 కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ మాట్లాడుతూ .. ‘మా ఈవెంట్‌కు వచ్చిన ఆనంద్ అన్నకి థాంక్స్. మట్టిలో మాణిక్యం అనే దానికి మై విలేజ్ టీం ఉదాహరణ. అనిల్‌ను ఇంత వరకు యూట్యూబ్ స్టార్‌గా చూశాం. ఇప్పుడు హీరోగా అందరినీ ఈ సిరీస్‌తో ఆకట్టుకోబోతోన్నారు. తెలంగాణ యాసతో వచ్చే వెబ్ సిరీస్ ఇదే. మనల్ని కరీంనగర్, నిజామాబాద్‌కు తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. ప్రేమ, హాస్యంతో పాటు కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఇంత తక్కువ బడ్జెట్‌లో మధుర శ్రీధర్ గారు అద్భుతంగా నిర్మించారు. మోతేవారీ సిరీస్‌కు ఇక ఫ్రాంచైజీలు వస్తూనే ఉంటాయ’ని అన్నారు.

అనిల్ జీలా మాట్లాడుతూ ..‘మా ‘మై విలేజ్ షో’ టీం నుంచి మొదటి సారిగా ఇలా సిరీస్ చేశాం. మధుర శ్రీధర్ గారు మొదటి సిట్టింగ్‌కే కథను ఓకే చేశారు. జీ5 టీం వల్లే ఈ సిరీస్ ఇంత బాగా వచ్చింది. అనురాధ మేడం ఎప్పుడూ మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ధైర్యం వల్లే ఈ సిరీస్‌ ఇక్కడి వరకు వచ్చింది. మేం ఈ ప్రయాణంలో చాలా కష్టాల్ని ఎదుర్కొంటూనే ఎంతో నేర్చుకున్నాం. చివరకు ఓ అద్భుతమైన సిరీస్ ఆడియెన్స్‌కు అందివ్వబోతోన్నాం. మేం ఇప్పటి వరకు ఎన్నో సార్లు చూశాం. ఆద్యంతం నవ్వుకుంటూనే ఉన్నాం. నన్ను విజయ్ దేవరకొండ అన్ననే సినిమాల్లోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు నా కోసం వచ్చిన ఆనంద్ అన్నకి థాంక్స్. మా సిరీస్ ఆగస్ట్ 8న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ .. ‘నేను అనిల్‌కి ఓ మూవీ చేద్దామని ఇన్ స్టాలో మెసెజ్ పెట్టాను. మనోడ్ని హీరో చేయాలని చాలా ప్రయత్నించాను. ఆ టైంలో ఈ స్క్రిప్ట్‌ని అనిల్, శివ కృష్ణ తీసుకు వచ్చారు. జీ5తో కలిసి ఈ సిరీస్‌ను చేయడం ఆనందంగా ఉంది. నమ్మకంతో, నిజాయితీతో సిరీస్ చేస్తే ఎలా ఉంటుందో ‘మోతేవారి లవ్ స్టోరీ’ అలా ఉంటుంది. తెలంగాణ మూలాల్లోంచి తీసిన మొదటి సిరీస్ ఇదే. హీరో, హీరోయిన్, డైరెక్టర్, కెమెరామెన్, చరణ్ అర్జున్ ఇలా అందరూ అద్భుతంగా పని చేశారు. మా కోసం వచ్చిన ఆనంద్ దేవరకొండకు థాంక్స్. ఆగస్ట్ 8న మా సిరీస్ రాబోతోంది. మా సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈ సిరీస్‌కు చెందిన నటీనటులు, టెక్నికల్ టీమ్ కూడా పాల్గొని మాట్లాడారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు