అథర్వ మురళీ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్గా తెరకెక్కిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘టన్నెల్’ ఇటీవల రిలీజ్ అయి తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ కాకుమాను విలన్గా కనిపించనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఎ.రాజు నాయక్ సెప్టెంబర్ 19న గ్రాండ్గా విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది. యాక్షన్, సస్పెన్స్తో గ్రిప్పింగ్గా సాగిందని ట్రైలర్నే సూచించింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటంతో సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారని మేకర్స్ తెలిపారు.
తమిళంలో హిట్ అయిన అథర్వ-లావణ్య జోడీ, ఇప్పుడు తెలుగులోనూ అలరించనుంది. యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, శక్తి శరవణన్ సినిమాటోగ్రఫీ అందించారు.