కరోనా వైరస్ మొత్తం ప్రపంచంలో ఒక రకమైన భయానిక వాతావరణాన్ని సృష్టించింది. ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా నివారణ చర్యలకు రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘హారిక అండ్ హాసిని’ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షలు, తెలంగాణా ప్రభుత్వానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు).
అలాగే నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ కూడా రూ. 20 లక్షలు విరాళంగా ప్రకటిస్తూ.. ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మా వంతు భాగస్వామ్యం.. అది చిన్నదే కావచ్చు.. అందిస్తున్నాం. కరోనాపై పోరాటానికి మద్దతుగా రూ. 20 లక్షలు విరాళంగా అందజేస్తున్నాం. వీటిలో రూ. 10 లక్షలు తెలంగాణ ప్రభుత్వానికీ, రూ. 10 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ అందిస్తున్నాం. ఆపత్సమయంలో ఎక్కువ కుటుంబాలకు సాయపడేందుకు మరింత మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. ఈ సంక్షోభాన్ని సమష్టిగా మనం అధిగమించగలం. సామాజిక దూరాన్ని పాటిస్తూ, కరోనా మహమ్మారిపై జరిపే పోరాటంలో విజయం సాధిద్దాం. సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండండి.. ఇంట్లో ఉండండి. అని తెలిపారు.