టాలీవుడ్ అందరికీ సినిమాలు చూపిస్తుంది.. అయితే ఇప్పుడు టాలీవుడ్కే సినిమా చూపిస్తోంది కరోనా. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కూడా చిక్కుల్లో పడింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఏకంగా 50 సినిమాలు ఆగిపోయాయని ఇండిస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సుమారు 600 కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు ఇరుక్కుపోయాయని సినీ వర్గాల నుండి వచ్చిన టాక్. రాజమౌళి 300 కోట్ల రూపాయల ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్, చిరంజీవి – ఆచార్య, ప్రభాస్ – జాన్, పవన్ కళ్యాణ్- వకీల్ సాబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే పలు ప్రాజెక్ట్ల విలువ సుమార్ 600 కోట్ల రూపాయలు ఉండొచ్చు అట.
ఈ నేపధ్యంలో సినీ పరిశ్రమ భవిష్యత్ గురించి ఇప్పుడే ఓ అంచనా రావటం కష్టమేనన్నారు సినీ పెద్దలు. ప్రతి ఏటా టాలీవుడ్ సుమారు 200 సినిమాలను తెరకెక్కుతాయి. లాక్డౌన్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ నష్టాలు ఎంత మేర ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేయలేమని.. ఇది పరిశ్రమకు మాత్రం పెద్ద దెబ్బగా మిగలబోతుందని నిర్మాతలు అంటున్నారు.
ఇక లాక్డౌన్ ఎత్తేసినా ఇఫ్పటికిప్పుడు సినిమా హాళ్ళకు అనుమతులు ఇవ్వటం అనుమానమే అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ పరిశ్రమకు సంబంధించి ఒక ఆర్ధిక సంవత్సరం పూర్తిగా పోయినట్లేనని సినీ విశ్లేషకుల అంచానా. సినీ పరిశ్రమ నష్టం ఒకెత్తు అయితే పరిశ్రమ పై ఆధారపడిన, వివిధ శాఖల్లో పనిచేసే సుమారు ఎనిమిది వేల మంది వరకు ఉపాధి కోల్పోయారు. మరి ఈ కరోనా కాలం ఎప్పుడు ముగుస్తుందో, సినిమా కాలం ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.