భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ తన కెరీర్లో అరుదైన, కొంతవరకు దురదృష్టకరమైన ఘనతను సాధించాడు. భారత్ ఓడిపోయిన టెస్ట్ మ్యాచ్లలో ఐదు సెంచరీలు చేసిన 5వ భారత ఆటగాడిగా పంత్ ఈ జాబితాలో చోటు సంపాదించాడు.
ఇటీవల ఇంగ్లండ్తో హెడింగ్లీలో జరిగిన మొదటి టెస్టులో పంత్ అసాధారణంగా రాణించాడు. రెండు ఇన్నింగ్స్లలో వరుసగా 134,118 పరుగులు చేసి రెండు అద్భుతమైన సెంచరీలు సాధించాడు. అయినప్పటికీ, భారత్ ఆ మ్యాచ్లో ఓడిపోవడంతో, అతని శ్రమ వృథా అయింది.
ఈ ప్రదర్శనతో పంత్ కొన్ని విశేషమైన రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసిన రెండవ వికెట్ కీపర్గా చరిత్రలో నిలిచాడు. అంతేకాక, ఓడిపోయిన మ్యాచ్లో ఈ ఘనత సాధించిన నాల్గవ భారత బ్యాటర్గా గుర్తింపు పొందాడు.
అయితే, ఈ విజయాలు పంత్కు కొంత చేదు రికార్డును కూడా తెచ్చిపెట్టాయి. అతని 8 టెస్ట్ సెంచరీలలో 5 సెంచరీలు భారత్ ఓడిపోయిన మ్యాచ్లలోనే వచ్చాయి. విదేశాల్లో చేసిన 6 సెంచరీల్లో భారత్ ఒక్కదాన్ని కూడా గెలవలేదు – అవి ఓటమి లేదా డ్రా మ్యాచ్లే.
ఓడిన టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు :
– ఈ జాబితాలో పంత్ భారత క్రికెట్ దిగ్గజాల సరసన నిలిచాడు.
– సచిన్ టెండూల్కర్ 11 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు.
– విరాట్ కోహ్లీ, మహమ్మద్ అజారుద్దీన్ చెరో 7 సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
– సునీల్ గవాస్కర్ 6 సెంచరీలు, రిషబ్ పంత్, వీరేంద్ర సెహ్వాగ్ చెరో 5 సెంచరీలతో ఈ జాబితాలో ఉన్నారు.
హెడింగ్లీ టెస్ట్ భారత్కు చారిత్రాత్మక ఓటమిగా నిలిచింది. టెస్ట్ క్రికెట్ 148 ఏళ్ల చరిత్రలో, ఒక జట్టులో ఐదు సెంచరీలు వచ్చిన తర్వాత కూడా ఆ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి.