డ్రగ్స్‌పై యువతకు అవగాహన అవసరం – రామ్ చరణ్

ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సినీ పరిశ్రమ నుంచి పలువురు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు మరో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తనదైన స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

డ్రగ్స్ పై యువతకు అవగాహన ఖచ్చితంగా అవసరమని ఆయన అన్నాడు. చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లినప్పుడు ఐస్ క్రీమ్, గోలీ సోడా బండ్ల దగ్గరకు వెళ్లే వాళ్లం. కానీ, ప్రస్తుతం అవే బండ్ల దగ్గర డ్రగ్స్ అమ్ముతున్నారు. ఇలాంటి ఘటనలు చూసి చాలా బాధ వేసింది. వీటిని చూసినప్పుడు ఓ తండ్రిగా భయం వేస్తుంది. హై కిక్ కోసం యువత ఇలాంటి తప్పటడుగులు వేయడం బాధాకరం. మంచి మార్కులు తెచ్చుకోవడం ఒక హై.. కుటుంబంతో సమయం గడపడం ఒక హై.. మంచి సినిమాలు చేయడం ఒక హై.. మంచి గేమ్ ఆడటం ఓ హై.. స్నేహితులతో సమయం గడపడం ఒక హై. ఇలాంటివి యువత ఆచరించాలి.

మన కుటుంబాలను మనమే కాపాడుకోవాలి. మన స్నేహితులను మనమే కాపాడుకోవాలి.. మన భవిష్యత్తుని మనమే కాపాడుకోవాలి అని చరణ్ అన్నారు. యువత ఇలాంటి డ్రగ్స్‌కు బానిస కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అవగాహన కార్యక్రమాలకు అందరం కలిసి సహకరిద్దాం అని చరణ్ తెలిపారు.

Exit mobile version