డైనమిక్ హీరో విష్ణు మంచు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ వీక్షించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ.. రజనీకాంత్తో కలిసి దిగిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ‘రజనీకాంత్ అంకుల్ రాత్రి ‘కన్నప్ప’ సినిమాని చూశారు. సినిమా చూశాక ఆయన నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. తనకు ‘కన్నప్ప’ సినిమా ఎంతగానో నచ్చిందని నాతో చెప్పారు. ఒక నటుడిగా ఈ క్షణం కోసం నేను 22 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది’ అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి ఎంతోమంది అగ్ర నటీనటులు కనిపించనున్న విషయం తెలిసిందే. పైగా మోహన్ బాబుతో పాటు కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, బ్రహ్మనందం, సప్తగిరి రఘు బాబు, ఐశ్వర్య రాజేష్, దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా భారీ తారగణంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నటుడు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు.