విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్ నిర్మించారు . చెందు ముద్దు దర్శకుడు. ఈ నెల 6న చిత్రం విడుదలవుతోంది. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘హీరోగా పరిచయమవుతున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్, విశ్వంత్, నిత్యాకి మంచి భవిష్యత్తు ఉండాలి. భవన నిర్మాణ రంగంలో ఆనందప్రసాద్గారు ఎంత సక్సెస్ అయ్యారో… చిత్రసీమలోనూ అంతే సక్సెస్ కావాలి.చిన్న చిత్రాలు బావుంటే ఆదరించే రోజులివి. అయితే… థియేటర్లు దొరకడం లేదనే సమస్య ఉంది. ఇటువంటి చిత్రాలకు థియేటర్లు ఇవ్వాలనీ, ప్రోత్సహించాలనీ కోరుకుంటున్నా. చిన్న చిత్రాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చిత్రసీమ బాగు, మెరుగుదల కోసం నేను, నాగార్జున, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్గారు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇక… ‘శంకర్దాదా’ టైమ్లో కేర్ వ్యాన్లు లేవు. ఇప్పుడొచ్చాయి. వాటిని అవసరాలకు వాడుకోవాలి తప్ప, లగ్జరీకి కాదు. కేర్వ్యాన్లో కూర్చున్న ఆర్టిస్టును పిలవడానికి సహాయ దర్శకుడి జీవితం సరిపోతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. నేను మేకప్, దుస్తులు మార్చుకోవడానికి మాత్రమే కేర్వ్యాన్ ఉపయోగిస్తా. లేదంటే లొకేషన్లో ఉంటా. హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు లొకేషన్లో ఉంటే… పని బాధ్యతగా, త్వరగా జరుగుతుంది. ఆర్టిస్టులు సెట్లో ఉండడం అవమానంగా భావించకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సెట్లో ఉండాలి. అప్పుడు 140 రోజుల్లో పూర్తి కావాల్సిన సినిమా, వంద రోజుల్లో పూర్తవుతుంది. భారీ బడ్జెట్ చిత్రాలు వంద రోజుల్లో పూర్తి చేస్తే… నిర్మాతలు లాభాల్లో ఉంటారు. తెలుగు చిత్రసీమలో సినిమా చేస్తే… ఎవరికీ నష్టాలు రావని ఇతర చిత్రసీమల్లో అనుకోవాలి. నిర్మాతల సంతోషం చూడాలి. అలాంటి పరిస్థితి వస్తుందనే నమ్మకం నాకుంది ” అన్నారు.
సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ ” అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. సైరా నరసింహ రెడ్డి నైట్ షూట్ టైంలో ఒక టాప్ వ్యూ షాట్ లో భాగంగా ఆయనతో పాటు మేమంతా షాట్ కి రెడీగా ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో సెట్ పైన ఒక అల్యూమినియం ఫాయిల్ ఉంది, షాట్ ఆయన వరకు వచ్చేలోపు టక్కున వెళ్లి అది తీస్కుని దగ్గర పెట్టుకున్నారు. అలాగే మరో సమయంలో భోజనమయ్యాక చేతులు కడుక్కుంటుండగా అసిస్టెంట్ మినరల్ వాటర్ చేయి కడగడానికి తెచ్చాడని అతన్ని కోప్పడ్డారు. ఇంకోసారి షాట్ టైంలో సీన్ అయిపోగానే వచ్చి మానిటర్ దగ్గరకి రాకుండా డైరెక్టర్ ఆ షాట్ ఓకే చేశాకే అక్కడినుండి కదిలారు. సమయం విలువ, డబ్బుల విలువ, నటన పై ఆసక్తి ఆయనని చూసి ఈ తరం వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి. ఆయన మా చిత్రం ఈవెంట్ కి వచ్చారంటేనే మేము సగం విజయం సాధించినట్టే. ఆయనది గోల్డెన్ లెగ్ మరి. చిన్న చిత్రమైన, నేను చిన్న నటుడ్ని అయినా, నాకిచ్చిన మాటకోసం ఆయన బిజీ సమయంలో మాకోసం వచ్చినందుకు మేమంతా ఎంతో రుణపడి ఉంటాం” అన్నారు. ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ “కొత్తవాళ్లతో మేం చేసిన ప్రయత్నానికి నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవిగారికి రుణపడి ఉంటాం. చిత్రసీమలో ఏ సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా ఉండి పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.అలాగే మా అన్ని చిత్రాల లాగే ‘ఓ పిట్ట కథ’ కూడా అన్ని విధాలుగా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం” అన్నారు.