నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా వై.వి.ఎస్.చౌదరి కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమంతో మొదలైంది. ఈసందర్భంగా చంద్రబాబు పోస్ట్ పెట్టారు. ‘‘తారక రామారావు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోన్న సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ఆల్ ది బెస్ట్ తెలిపారు.
అలాగే, నారా భువనేశ్వరి కూడా పోస్ట్ పెడుతూ – ‘చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన బాధను అధిగమించడం నుంచి ఈరోజు హీరోగా ఎంట్రీ ఇవ్వడం వరకూ తారక్ ప్రయాణం మాకెంతో గర్వకారణం. నా మనవడు నందమూరి తారక రామారావు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోన్న సందర్భంగా అభినందనలు. నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ మరిన్ని విజయాలు అందుకోవాలి’ అని తన పోస్ట్లో తెలిపారు.
ఈ పూజా కార్యక్రమంలో హీరో తారక రామారావు మాట్లాడుతూ.. ‘‘మా ముత్తాత ఎన్టీఆర్, మా తాత హరికృష్ణ, మా నాన్న జానకిరామ్ ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉంటాయి. ఈరోజు నా ఫ్యామిలీ అంతా నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటినుంచి మీడియా ఎంతో సహకరించింది. వారందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను’’ అని అన్నారు.