మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ HBJ క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా ‘చండీ దుర్గమా’. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘చండీ దుర్గమా’ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ నటుడు చిట్టి చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ కమెడియన్ అలీ మాట్లాడుతూ..‘చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలి. ప్రొడ్యూసర్ జయశ్రీ గారికి, డైరెక్టర్ మైను ఖాన్ తో సహా టీమ్ అందరికీ మంచిపేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.’ అని అన్నారు.
డైరెక్టర్ మైను ఖాన్ ఎండీ. మాట్లాడుతూ.. ‘మా చండీ దుర్గమా చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టిన అలీ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. రఘు కారుమంచి, చిట్టి కూడా మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఇటీవల అమ్మవారి నేపథ్యంగా సినిమాలు రూపొందడం లేదు. సౌందర్య గారి అమ్మోరు, విజయశాంతి గారి చండీ సినిమా తర్వాత అమ్మవారి కథతో సినిమా రాలేదు. ఇప్పటి ట్రెండ్కు అనుగుణంగా, ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా డార్క్ థీమ్ లో సరికొత్త స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ తో చండీ దుర్గమా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్ కు ఆడియెన్స్ ను రప్పించేలా చండీ దుర్గమా సినిమా మేకింగ్ ను డిజైన్ చేస్తున్నాం. చండీ దుర్గమా సినిమా ఒక మాస్టర్ పీస్ అవ్వాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.
నిర్మాత జయశ్రీ వెల్ది మాట్లాడుతూ.. ‘అమ్మవారి నేపథ్యంతో ఒక మంచి కథతో చండీ దుర్గమా సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మన తెలుగు ఆడియెన్స్ అమ్మవారి నేపథ్యంగా వచ్చిన చిత్రాలను ఎంతో ఆదరించారు. మా సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం. హై క్వాలిటీ మేకింగ్ తో మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు, ప్రతిభ గల కొత్త నటీనటులతో చండీ దుర్గమా సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం.’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫర్ వైఎస్ కృష్ణ, నటుడు చిట్టి, నటుడు రఘు కారుమంచి, కో ప్రొడ్యూసర్ ఒలి పాల్గొని వారు తమ బెస్ట్ విషెస్ తెలిపారు.