రోహిత్, కోహ్లీ, అశ్విన్ లేని భారత జట్టు : యువ ఆటగాళ్లకు గంభీర్ ప్రోత్సాహం, ప్రత్యేక విజయాలపై ఆశలు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత, టీమ్ ఇండియా ఇప్పుడు కొత్త తరానికి అవకాశం ఇస్తోంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించనున్నారు.

ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. యువ ఆటగాళ్లకు ఇది తమ ప్రతిభను చూపించడానికి, దేశానికి ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి సరైన సమయం అని ఆయన స్పష్టం చేశారు.

గంభీర్ మాట్లాడుతూ.. “మన పరిస్థితిని రెండు కోణాల్లో చూడొచ్చు. ఒకవైపు, మనం ముగ్గురు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకుండా ఆడబోతున్నాం. మరొకవైపు, ఇది మనకు దేశం కోసం కొత్త చరిత్ర సృష్టించడానికి గొప్ప అవకాశం. ఈ జట్టులో ఆకాంక్ష, పట్టుదల, ప్రత్యేకంగా ఏదైనా సాధించాలనే తపన ఉంది” అని చెప్పారు.

యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ గంభీర్ మాట్లాడుతూ.. “మనము త్యాగాలు చేస్తే, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే, కష్టపడితే – ప్రతి సెషన్, ప్రతి గంట, ప్రతి బంతి మన జీవితంలో చిరస్మరణీయంగా నిలుస్తుంది. దేశం కోసం ఆడటం కన్నా గొప్ప గౌరవం మరొకటి లేదు. ఈ రోజు నుంచే ఆ భావనతో ముందుకు సాగాలి.”

రోహిత్, కోహ్లీ, అశ్విన్ లాంటి సీనియర్లు రిటైర్ కావడం భారత క్రికెట్‌లో పెద్ద మార్పు. ఇప్పుడు యువతరం ఈ బాధ్యతను తీసుకుని, తమ ప్రతిభతో దేశాన్ని గర్వపడేలా చేయాల్సిన సమయం వచ్చింది.

Exit mobile version