సైమా 2025 లో రెండు అవార్డులతో సత్తాచాటిన ‘కమిటీ కుర్రోళ్లు’

సైమా 2025 లో రెండు అవార్డులతో సత్తాచాటిన ‘కమిటీ కుర్రోళ్లు’

Published on Sep 7, 2025 10:29 AM IST

SIIMA-2025

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నటిగా, నిర్మాతగా నిహారిక కొణిదెల ఈ చిత్రంతో అవార్డులు, రివార్డులు అందుకుంటూనే ఉన్నారు. థియేటర్లో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. రూ.9 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట్రిక‌ల్‌గా రూ.18.5 కోట్లు వ‌సూళ్ల‌ను రాబ‌డితే, నాన్ థియేట్రిక‌ల్‌గా రూ.6 కోట్లు బిజినెస్ జ‌రిగింది. మొత్తంగా సినిమా రూ.24.5 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ ఈ చిత్రం ఇప్పుడు అనేక వేదికలపై అవార్డుల్ని కొల్లగొట్టేస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీకి మంచి గుర్తింపు లభించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ సత్తా చాటుకుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా, దర్శకుడు యధు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డులు సాధించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా గామా అవార్డుల్లోనూ ‘కమిటీ కుర్రోళ్లు’ సత్తా చాటింది. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా యదు వంశీకి గామా అవార్డులు వచ్చాయి.

ఇక ఇప్పుడు సైమా 2025 వేడుకల్లోనూ ‘కమిటీ కుర్రోళ్లు’ సత్తా చాటింది. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సందీప్ సరోజ్ కి సైమా అవార్డు వచ్చింది. దీంతో ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. నిర్మాతగా తొలి ఫీచర్ ఫిల్మ్‌తోనే నిహారిక టాలీవుడ్‌లో ఓ హిస్టరీని క్రియేట్ చేసినట్టు అయింది. ఈ మూవీకి యదు వంశీ డైరెక్టర్‌గా, ఎదురురోలు రాజు సినిమాటోగ్రఫర్‌గా, అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమాకు మన్యం రమేష్ ప్రొడక్షన్ వ్యవహరాల్ని చూసుకున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9, 2024న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు