లాక్ డౌన్ కాలాన్ని మే 3వరకు పొడిగించుతూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను అభినందించారు. కారోనా వైరస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ యుద్ధంలో అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీస్, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ ఎంత భయానకమైనదైనా, దాని వల్ల దేశమంతా ఒక్కటేననే భావన ఏర్పడటం, కుల మత భేదం లేకుండా, పేద ధనిక తారతమ్యం లేకుండా అందరం ఐకమత్యం ప్రదర్శించడం గొప్ప విషయం అని అన్నారు . ఇదే స్ఫూర్తితో మే 3 వరకు కొనసాగనున్న లాక్డౌన్ను విజయవంతం చేద్దాం. అందరం ఇళ్లల్లో ఉండి ప్రభుత్వాలకు, పోలీసులకు పూర్తిగా సహకరిద్దాం అని బోయపాటి ఓ సుదీర్ఘ సందేశం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ప్రస్తుతం బోయపాటి నటసింహం బాలయ్యతో ఓ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక బాలయ్య ఈ చిత్రంలో కూడా రెండు గెటప్స్ లో కనిపిస్తాడని తెలుస్తుండగా, ఓ రోల్ లో అఘోరాగా చేస్తున్నాడని వినికిడి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.