హీరో సుశాంత్ సింగ్ ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను, అభిమానులను శోక సముద్రంలో ముంచివేశారు. మంచి భవిష్యత్ కలిగిన యువ నటుడు ఇలా ప్రాణాలు తీసుకున్నాడన్న విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా జరిగి ఉండకూడదు అని దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు దేశంలోని అన్ని పరిశ్రమలకు చెందిన నటులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. వారి కుటుంబానికి ధైర్యాన్ని, ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
ఐతే కొన్ని రోజులుగా సుశాంత్ మానసిక వేదన అనుభవిస్తున్నాడని తెలుస్తుంది. అందుకు ఆయన చివరి ఇంస్టాగ్రామ్ పోస్ట్ నిదర్శనం. ఆ పోస్ట్ లో ఆయన మరణించిన తన తల్లి ఫోటో మరియు తన ఫోటో పోస్ట్ చేశారు. ”కన్నీళ్ళలో అస్పష్టంగా గతం ఆవిరైపోతుంది…అంతులేని కలలు ముఖం పై చిరునవ్వును చెక్కుతున్నాయి. ఈ రెండిటి మధ్య క్షణకాల జీవితం ఊగిసలాడుతుంది… అమ్మా” అని ఆయన పోస్ట్ పెట్టారు. సుశాంత్ సింగ్ కి వాళ్ళ అమ్మతో ఘాడమైన అనుబంధం ఉండగా ఆమె జ్ఞాపకాలు ఆయన్ని వెంటాడేవని తెలుస్తుంది.