ఎన్నో రోజులుగా ఊరిస్తున్న ‘రుద్రమ దేవి’ సినిమా పై వస్తున్న ఊహగానాలకి గుణ శేఖర్ తెరదించాడు. ఆయన రాణి రుద్రమ దేవి మీద సినిమా తీయబోతున్నట్లు గత సంవత్సర కాలం నుండి ఊహగానాలు నడుస్తున్నాయి. తాను రుద్రమ దేవి అనే సినిమా తీయబోతున్నట్లు గుణ శేఖర్ ఈ రోజు ప్రకటించారు. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుణ శేఖర్ మాట్లాడుతూ “గత పదేళ్లుగా ఈ సినిమా చేలని అనుకుంటూ వస్తున్నాను. ఒక్కడు సినిమా తరువాత ఈ సినిమానే చేద్దామనుకున్నాను. కానీ హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో స్టార్ హీరోలు లేకుండా ఇంత భారీ సినిమా చేయడానికి ధైర్యం సరిపోలేదు. శ్యాం ప్రసాద్ రెడ్డి గారు తీసిన ‘అరుంధతి, రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమాలు ఎలాంటి స్టార్ హీరోలు లేకుండా స్టార్ హీరోల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా హిట్ కావడంతో నాక్కూడా ధైర్యం వచ్చి ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాను. ఇండియాలో వస్తున్న మొట్టమొదటి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి సినిమా ఇది. అనుష్క ప్రధాన పోషిస్తుంది. ఈ సినిమాతో నేను నిర్మాతగా కూడా మారుతున్నాను. గుణా టీం వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాను. ఇళయరాజా గారు సంగీతం అందించబోతున్నారు. వచ్చే ఏడాది 2013 ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభమవుతుంది”.