టాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి చిత్రం ఓ నయా ట్రెండ్ సెట్ చేసింది. రామ్ గోపాల్ వర్మ శివ చిత్రం తర్వాత.. తెలుగు సినిమాల్లో సరికొత్త మార్పులకు నాంది పలికిన చిత్రం అర్జున్ రెడ్డి. పాత్ బ్రేకింగ్ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా, తాను డైరెక్ట్ చేసిన తొలి సినిమాతోనే క్రేజీ డైరెక్టర్గా పాపులర్ అయ్యారు. ఆ క్రేజ్ కారణంగానే బాలీవుడ్ నుండి టీ సిరీస్ సంస్థ భారీ ఆఫర్ ఇవ్వడంతో ఇదే చిత్రాన్ని కబీర్సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సెన్షేషనల్ హిట్ని దక్కించుకున్నారు.
ఇక త్వరలో మరో భారీ ప్రాజెక్ట్ని ప్రకటించడానికి రెడీ అవుతున్న టైమ్లో.. లాక్ డౌన్ కారణంగా సందీప్ ప్లాన్ మొత్తం తారుమారైపోయింది. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న సందీప్రెడ్డి బి ది రియల్ మెన్ ఛాలెంజ్ మొదలు పెట్టారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం.. ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడం మొదలు పెట్టారు విజయ్ దేవరకొండ.
ఈ విషయం తెలుసుకున్న సందీప్, విజయ్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. దీనికి వెంటనే స్పందించిన విజయ్, నిన్ను మిస్సవుతున్నా వంగ.. ఈ లాక్ డౌన్ వేళ 2 లేదా 3 కథల్ని సిద్ధం చేస్తే, లాక్డౌన్ తర్వాత ఇద్దరం కలిసి సినిమా చేయొచ్చని ట్వీట్ చేశాడు. దీంతో అర్జున్ రెడ్డి కాంబోలో మరో సినిమా రాబోతుందంటూ.. రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.