తమిళ వెర్సటైల్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల కలయికలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘కుబేర’ సెన్సేషనల్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో వీరితో పాటుగా మరో బిగ్ ప్లస్ కింగ్ నాగార్జున కూడా అని చెప్పవచ్చు. ఆ ఇద్దరితో పాటుగా ఈ సినిమా ఆద్యంతం కొనసాగుతూ కింగ్ సాలిడ్ పెర్ఫామెన్స్ ని ఈ చిత్రంలో కనబరిచి ఆశ్చర్యపరిచారు.
ఇక కుబేరలో నాగార్జున దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. మన టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోస్ లో ఒకరైన నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అలా ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్.
అది కూడా నాగ్ కి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి ముఖ్యంగా గమనిస్తే డీ గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తోంది.
శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే, ఆయనను ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు, తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు. ఒక రాకంగా ఆయన మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చేసాడు. దీంతో కేవలం ప్రేక్షకులు, విమర్శకులు, అభిమానుల నుంచే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలో నాగార్జున నటించాడు అనడం కన్నా జీవించాడు అంటేనే సరిగ్గా ఉంటుంది.
శేఖర్ కమ్ముల సినిమాలో క్యారెక్టర్లు చాలా నేచురల్ గా ఉంటాయి, అలాంటి పాత్రలో నాగ్ ఒదిగిపోయి నటించాడు. ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తి మీద సాము లాంటి విషయం. అలాంటి పాత్రలో కూడా ఆయన నటించి, కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అనే ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. నాగ్ అసలు ఈ క్యారెక్టర్ ను ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకుని ఇలా ఎలా యాక్ట్ చేశాడు అనే చర్చ జరుగుతోంది. ఇలా కుబేరలో నాగార్జున తనకంటూ కూడా ఒక స్పెషల్ మార్క్ వేసుకొని అదరగొట్టారు.