విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కి మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. డివోషనల్ బ్లాక్ బస్టర్గా ఈ చిత్రం ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు విజయవాడలో ప్రఖ్యాత గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ ‘కన్నప్ప’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోని డా.ఎం.మోహన్ బాబుతో పాటుగా నాగ సాధువులు, అఘోరాలు వీక్షించారు.
ఈ సందర్భంగా డా.ఎం.మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘‘కన్నప్ప’ సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతీ చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. ఇక ఈ రోజు ఇలా విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘కన్నప్ప’ను వెండితెరపైకి మళ్లీ తీసుకు రావడం ఓ గొప్ప నిర్ణయం. చిత్రం అద్భుతంగా ఉంది. విష్ణు నటన కన్నుల విందుగా అనిపించింది. కన్నప్ప జీవితాన్ని మరోసారి ఇంత అద్భుతంగా తీసిన నిర్మాత మోహన్ బాబు గారికి ధన్యవాదాలు. సినిమా ఆద్యంతం రోమాంచితంగా ఉంది. సంపూర్ణమైన భక్తి రస చిత్రంగా తీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్, విష్ణు నటన అందరినీ కదిలించింది. ఈ రోజు నాగ సాధువులు, సాధువులు, మాతాజీలు, యోగినీలు ఎంతో మంది సినిమాను చూసి ఆనందిస్తున్నారు’ అని అన్నారు.