జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. ఈ దాడికి సంబంధించిన వార్తతో దేశవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఉగ్రవాదులు చేసిన దాడిని అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అయితే, ఈ ఉగ్రదాడి నుంచి ఓ సెలబ్రిటీ జోడీ కొద్దిలో తప్పించుకున్నారు.
నటి దీపికా కాకర్ తన భర్త షోయబ్ ఇటీవల కశ్మీర్ వెళ్లారు. వారు అక్కడి అందాలను వీడియో తీసి తమ సన్నిహితులతో షేర్ చేసుకున్నారు. అయితే, ఈ ఉగ్రదాడి గురించి తెలుసుకుని అందరూ వారి గురించి ఆరా తీయసాగారు. కాగా, తాము కశ్మీర్ నుంచి ఢిల్లీ చేరుకున్నామని దీపికా తన సన్నిహితులతో చెప్పుకొచ్చింది. ఆమె భర్త షోయబ్ దీనికి సంబంధించి తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేశాడు.
తాము క్షేమంగా ఉన్నామని.. కశ్మీర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నామని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నాడు. ఉగ్రదాడి నుంచి తృటిలో ఈ జోడీ తప్పించుకుందని తెలుసుకుని వారి సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు.