బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రశంసలు కురిపించారు. ఇంతకీ, ఫడనవీస్ ఏం మాట్లాడారు అంటే.. ‘భారత్లో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. మన కళ, నాటక రంగం, సంగీతం చాలా పురాతనమైనవి. వీటికి తాజాగా సాంకేతికత జోడించాలని అనుకుంటున్నాం. రామాయణ విషయంలోనూ ఇదే జరుగుతోంది. నేను ప్రధానితో కలిసి ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ను సందర్శించాను. దాని క్వాలిటీ చూసి ఆశ్చర్యపోయాను’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
దేవేంద్ర ఫడణవీస్ ఇంకా మాట్లాడుతూ.. ‘కొత్త తరానికి మనం కథలు చెప్పడానికి ఇదే సరైన మార్గం. మీరు తీస్తోన్న సినిమా ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటుందని నేను నమ్ముతున్నా’’ అని తెలిపారు. ఇక ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. దర్శకుడు నితేష్ తివారీ రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా పై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగూ పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది కాబట్టి, అన్ని వర్గాల్లోనూ ఆసక్తి ఉంది.