కామెడీ రోల్స్ తో ఎన్నో చిత్రాల్లో ఆకట్టుకున్న “అల్లరి” నరేష్ హీరోగా ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న చిత్రం ‘నాంది’. విజయ్ కనకమేడల దర్శకునిగా పరిచయం అవుతున్నారు.. నరేష్ అండర్ ట్రయల్ ఖైదీగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి లాక్డౌన్ విధించక ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది.
ఇటీవల హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మూడు రోజుల పాటు షూటింగ్ జరిపారు.అయితే ఈ చిత్రం షూటింగ్ ను నిలిపారు.దీనితో ఈ చిత్ర యూనిట్ కు కరోనా వచ్చింది అని ప్రచారం జరిగింది. కానీ ఇపుడు చిత్ర యూనిట్ వాటిని ఖండించారు.దయచేసి అలాంటి వదంతులను ప్రచారం చేయవద్దనీ, వాటిని నమ్మవద్దనీ కోరింది. గత బుధవారం వర్షం రావడంతో చిత్రీకరణ నిలిపివేసామని కేవలం వర్షం వల్లే చిత్రీకరణను ఆపాం తప్ప, వేరే కారణంతో కాదని స్పష్టం చేసింది.
‘నాంది’ అల్లరి నరేష్ నటిస్తోన్న 57వ చిత్రం. ఇప్పటివరకూ ఎక్కువ శాతం సినిమాల్లో ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ వచ్చిన ఆయన ఈ చిత్రంలో వాటికి పూర్తి భిన్నమైన, ఒక ఉద్వేగభరితమైన పాత్రను చేస్తున్నారని ఇటీవల విడుదల చేసిన టీజర్తో తెలిసింది. ఈ టీజర్కు అనూహ్యమైన స్పందన వచ్చింది. నటుడిగా అల్లరి నరేష్లోని మరో కోణాన్ని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం.ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్కుమార్ లాయర్గా, హరీష్ ఉత్తమన్ పోలీస్ ఇన్స్పెక్టర్గా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అలాగే ఈ చిత్రానికి సాంకేతిక వర్గం కథ: తూమ్ వెంకట్, డైలాగ్స్: అబ్బూరి రవి, సాహిత్యం: చైతన్య ప్రసాద్, శ్రీమణి అలాగే సంగీతం: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: సిద్, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి,ఫైట్స్: వెంకట్, నిర్మాత: సతీష్ వేగేశ్న, స్క్రీన్ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల అందిస్తున్నారు.