విక్టరీ వెంకటేష్ తన సినిమా ‘నారప్ప’ షూట్ లో ఇప్పటికే పాల్గొన్న సంగతి తెలిసిందే. మార్చి నెలలోనే 70 శాతం షూటింగ్ ముగియగా.. మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ ను పూర్తి చేయడానికి హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. కాగా ఈ షెడ్యూల్ లో చేస్తోన్న సీన్స్ సినిమాలోనే కీలకమైనవి అట. అయితే ఈ సీన్స్ లోనే కీలక ఘట్టం అయిన ఓ సన్నివేశాన్ని నిన్నటితో షూటింగ్ పూర్తి చేశారని.. ఎక్కువమంది క్రూతో షూట్ చేశారని తెలుస్తోంది. ఈ కీలక ఘట్టంలో వెంకీ సహా ముఖ్యమైన నటీనటులంతా షూటింగ్లో పాల్గొంటున్నారు.
ఇక లాక్ డౌన్ కి ముందు రిలీజ్ చేసిన ఈ చిత్రంలోని వెంకీ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘నారప్ప’గా విక్టరీ వెంకటేష్ లుక్ చాలా ఇంటెన్స్గా ఉంది. మాస్ గెటప్లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ప్రైజ్ చేశారు. కాగా తమిళ్లో బ్లాక్బస్టర్ హిట్గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్ పని చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది.