‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ షోరీల్ విడుదల చేసిన రామ్ చరణ్..!

‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ షోరీల్ విడుదల చేసిన రామ్ చరణ్..!

Published on Dec 22, 2020 8:30 PM IST

ప్రముఖ దిగ్గజ ఓటీటీలలో ఒకటైన ‘జీ 5’లో మరో వెబ్ సిరీస్ రాబోతుంది. డిసెంబర్ 25న ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామా సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ను జీ 5 తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్‌లు కలిసి దీనిని నిర్మించారు. అయితే మంగళవారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ సిరీస్ షోరీల్‌ను విడుదల చేశారు.

అయితే ‘లూజర్’ నుండి ‘చదరంగం’, ‘గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)’ వరకు.. ఒరిజినల్ వెబ్ సిరీస్ నుండి డైరెక్ట్-టు-ఒటిటి ఫీచర్ ఫిలిమ్స్ వరకు.. కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా, గ్యాంగ్ స్టర్ డ్రామా వంటు డిఫరెంట్ జానర్ కంటెంట్‌ను ‘జీ 5’ ప్లాట్‌ఫామ్ వీక్షకులకు అందించింది. ఇప్పుడు ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’తో మరోసారి వీక్షకుల మనసు గెలుచుకునేందుకు సిద్దమయ్యింది.

మెగస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా నిర్మించిన వెబ్ సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’. ‘జీ 5’ అసోసియేష‌న్‌తో కలిసి ఈ సిరీస్‌ను నిర్మించారు. డిసెంబర్ 25న ఈ వెబ్ సిరీస్ ‘జీ 5’లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్, తేజా కాకుమాను తదితరులు ఇందులో ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. దీనికి ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తుండగా, మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయని ‘జీ 5’ వర్గాలు వెల్లడించాయి.

అయితే షోరీల్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ “జీ 5 ఓటీటీకి హెడ్ గా మాత్రమే కాకుండా, మా అక్క సుష్మిత, బావ విష్ణుకి మెంటర్‌గా ఉన్న ప్రసాద్ నిమ్మకాయల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ‘ఓయ్’ సినిమాను నేను చూశానని, జిమ్ కి వెళుతూ ఎన్నో నెలలు ఆ సినిమాలో పాటలు కారులో వింటూ ఉండేవాడినని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మా అక్క, బావ (సుష్మిత – విష్ణుప్రసాద్)తో అసోసియేట్ అయి ఓటీటీ వేదిక కోసం ఆయన మళ్ళీ సిరీస్ చేయడం కమ్ బ్యాక్ లో అక్కాబావకి సపోర్ట్ చేయడం హ్యాపీగా ఉందని ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ షోరీల్ ఫెంటాస్టిక్ గా ఉందని అన్నారు. ఇక నటన విషయంలో, రియలిస్టిక్ లుక్ విషయంలో నటీనటులు అందరూ బెస్ట్ ఇచ్చారని అన్నారు. మనమంతా ఏదైతే కోరుకుంటున్నామో అటువంటి ప్రాజెక్ట్ ఇది అని కరోనా మహమ్మారి కాలంలో ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ టీమ్ అంతా బయటకు వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు. అయితే ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ మళ్లీ తన కాళ్ల మీద నిలబడిందని, ఎలా మొదలైందని అనేది కాదు… ఏడాది ఎలా ముగిసిందనేది చాలా అంటే చాలా ముఖ్యమని అన్నారు. ‘జీ 5’ మద్దతుతో డిసెంబర్ 25న విడుదలవుతున్న ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’తో మంచి ఎండింగ్ ఇస్తామని ఆశిస్తున్నట్టు తెలిపారు.

అక్క సుష్మితా కొణిదెల గురించి కూడా రామ్ చరణ్ మాట్లాడుతూ “నాన్నగారు 79లో ఇండస్ట్రీలో ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి మా కుటుంబం ఎన్నో ప్రయోగాలు, కొత్త ప్రయత్నాలు చేస్తూనే వచ్చిందని, ఇలాంటివి చేస్తున్నప్పుడల్లా మేమంతా కష్టపడుతున్నామని గర్వంగా చెప్పగలనని అన్నారు. ఇటువంటి కొత్త (ఓటీటీ) విభాగంలో సుష్మిత ఫైటర్ అని చెప్పవచ్చని, ‘రంగస్థలం’కి అక్క స్టయిలిస్ట్ గా పని చేసిందని, నా ఫస్ట్ ప్రొడక్షన్ ‘ఖైదీ నంబర్ 150’కి కూడా అక్క పని చేసిందని అన్నారు. బయటవాళ్ళు అయితే తిట్టించుకుని పని చేయించుకుంటాం కానీ ఇంట్లోవాళ్లను తిట్టలేమని కానీ నాన్నగారు మాత్రం నన్ను తిట్టేవారని అన్నారు. నేను ఎవరినైనా కసురుకోవాలన్నా, ఏమైనా కోపం చూపించాలన్నా అక్క మీద చూపించేవాడినని, నా బిగ్గెస్ట్ సపోర్ట్ తనే అని అన్నారు. ఈ సిరీస్ తో అక్క తప్పకుండా సక్సెస్ అందుకుంటుందని అన్నారు.

ఇక క్రియేటివ్ హెడ్ ‘జీ 5’ సౌత్ ప్రసాద్ నిమ్మకాయల మాట్లాడుతూ “గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణసంస్థను లాంచ్ చేయడానికి ఇండియాలో లీడింగ్ ఓటీటీ వేదిక అయిన మా ‘జీ 5’ను ఎంపిక చేసుకున్నందుకు విష్ణుప్రసాద్, సుష్మితా కొణిదెల దంపతులకు థాంక్స్ చెప్పుకొచ్చారు. హిందీ సహా ప్రాంతీయ భాషల్లో ‘జీ 5’ క్వాలిటీతో కూడిన మంచి కంటెంట్ వీక్షకులకు అందిస్తోందని, కరోనా కాలంలో 500 గంటల నిడివి కల షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ లు అందించాలని అనుకున్నామని, అందులో 5 ఒరిజినల్ షోలు తెలుగువే అని అన్నారు. ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ విషయానికి వస్తే ఇది ఇంటెన్స్ అండ్ యాక్షన్ సిరీస్ అని వీక్షకులను ఇది ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అన్నారు.

ఆనంద్ రంగా మాట్లాడుతూ “థాంక్స్ చరణ్, థాంక్స్ అన్నయ్యా ఫర్ ఎవిరీథింగ్ అంటూ సుష్మిత, విష్ణుప్రసాద్‌లకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కంటెంట్ వర్క్ అవుతుందని ఆశిస్తున్నా అని అన్నారు. ఇక విష్ణుప్రసాద్ కూడా మాట్లాడుతూ ఇది “ఫెంటాస్టిక్ సిరీస్ అని ఓటీటీలో గేమ్ చేంజర్ అవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రసాద్ నిమ్మకాయల గారి మద్దతు, మార్గదర్శకత్వం లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదని, టీమ్ అంతా గ్రేట్ వర్క్ చేశారని అన్నారు.

సుష్మితా కొణిదెల మాట్లాడుతూ ఈ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ ప్రాజెక్ట్ కి మాత్రమే కాదని నా జీవితంలో ముఖ్యమైన సందర్భాలు, విషయాల్లో చరణ్ ఎప్పుడూ నాకు అండగా ఉన్నాడని, తన విషయంలో నేనెంతో గర్వంగా ఉన్నట్టు తెలిపారు. అవకాశాలు, అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం రెడీగా ఉండాలని, అలా కాకుండా మనమే ముందుకు వెళ్లి అవకాశాల కోసం చూడాలనీ, అవి వచ్చినప్పుడు మనం తీసుకోవాలని నాన్నగారు చెబుతారని అన్నారు. అయితే అటువంటి స్ఫూర్తి ఇవ్వడంతో పాటు కొండంత అండగా నిలబడిన నాన్నగారికి థాంక్స్ అనీషూట్-అవుట్ ఎట్ ఆలేరు’ సిరీస్ చేసే అవకాశం జీ 5 నుండి మా దగ్గరకు వచ్చిందని, ప్రసాద్ గారు మాకు చాలా విషయాల్లో సపోర్ట్ గా ఉన్నారని, ఆనంద్ కూడా మంచి డైరెక్టర్ అని, అతని టీమ్ వలన ఈ ప్రాజెక్టు ఎంతో మెమరబుల్ అయ్యిందని అన్నారు. ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు మా మొదటి ప్రాజెక్ట్ లో ఉండటం ఎంతో ఎగ్జయింటింగ్ గా ఉందని, వాళ్లతో ఉంటే మా ఫ్యామిలీతో సెట్ లో ఉన్నట్టే ఉందని అన్నారు. తేజ, నందిని, రజాక్, గాయత్రీ, మోయిన్ అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారని, కరోనా కాలంలో కూడా సిరీస్ స్టార్ట్ చేసి, జీ5కి టైమ్ కి అందించగలిగామంటే కారణం మా టీమ్ చేసిన హార్డ్ వర్క్.” అని అన్నారు.

ఇక నందినీరెడ్డి మాట్లాడుతూ “ప్రసాద్ నిమ్మకాయల నాకు చాలా సంవత్సరాల నుండి పరిచయమని, ఆయన జీ 5లో జాయిన్ అయిన వేళా విశేషమేమో అప్పటి నుండి హిట్స్ మీద హిట్స్ ఇస్తూ ఉన్నారని అన్నారు. ఇక సుష్మితాగారిని ఏడాది క్రితం కలిస్తే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నామని చెప్పానని అన్నారు. ఏదైనా సలహాలు ఇస్తారా? అని అడిగితే మూడు విషయాలు చెప్పానని సింపుల్ గా ఉంచమని చెప్పా కానీ అది మర్చిపోయారు. గ్రాండ్ గా తీశారు. మిగతా రెండు విషయాలు పాటించారు. బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ గ్రేట్ ప్లానింగ్ తో దీనిని తీశారని అన్నారు. అయితే ఆనంద్ రంగా నాకు చాలా సంవత్సరాలుగా తెలుసని, ఆయన్ బ్రిలియంట్ మేకర్ అని అన్నారు. ఈ సిరీస్ కోసం తాను ఎంతగానో వెయిట్ చేస్తున్నానని, ఒక్కొక్క షాట్ చూస్తుంటే ఒక్కొక్క యాక్టర్ ఎంత బాగా నటించారో అర్థం అవుతోందని అన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో నటీనటులు నందినీరాయ్, తేజ, సందీప్ సాహు, మొయిన్, సినిమాటోగ్రాఫర్ అనిల్ బండారి, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమారన్, ఎడిటర్ నారాయణ, పబ్లిసిటీ పోస్టర్ డిజైనర్లు అనిల్-భాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య తదితరులు పాల్గొన్నారు.

‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’లో ఐజీ ప్రవీణ్ చంద్ పాత్రలో శ్రీకాంత్, ఎస్పీ సూర్యనారాయణగా ప్రకాష్ రాజ్, అక్తర్ పాత్రలో తేజా కాకుమాను, నఫీసాగా నందినీ రాయ్, నాసిర్ పాత్రలో సందీప్ సాహు, సెల్వ కుమారిగా గాయత్రీ గుప్తా, యు. రాకేష్ పాత్రలో మొయిన్ నటించారు.

తాజా వార్తలు