తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి మహా గ్రూప్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ ఆహ్వానించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన వంశీకృష్ణ, నవంబర్ 26న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా కోరారు.
మహా గ్రూప్ ఆధ్వర్యంలో, మహా భక్తి ఛానల్ సారథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ప్రతి ఏటా ఘనంగా జరుగుతోంది. ఈ సంవత్సరం హైదరాబాద్లో జరగనున్న ఈ వేడుకకు వేలాది మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 26వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు ఈ మహోత్సవం ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, శ్రీవారి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులంతా పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు కోరారు.
