హీరో విక్రాంత్, చాందినీ చౌదరి హీరోయిన్గా నటించిన “సంతాన ప్రాప్తిరస్తు” ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కి సిద్ధమవుతోంది. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర రిలీజ్ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలను హీరో విక్రాంత్ మీడియాతో పంచుకున్నారు.
– విజయవాడ మా స్వస్థలం. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. యూఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా సినిమాల మీద ప్యాషన్ తగ్గలేదు. కోవిడ్ సమయంలో లైఫ్ వెయిట్ చేయకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామో చేయాలి అనిపించింది. ఇండియాకు వచ్చి ‘స్పార్క్’ సినిమా చేశా. ఆ అనుభవం తర్వాత నటనను మెరుగుపర్చుకోవడానికి థియేటర్ జాయిన్ అయ్యా.
– ఒక రోజు శ్రీధర్ గారిని కలిసినప్పుడు ఆయన ఈ స్క్రిప్ట్ పంపారు. హీరోకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే ఒక భిన్నమైన కథ. మొదట తెలుగు ప్రేక్షకులు అంగీకరిస్తారా అనిపించింది. కానీ కథ పూర్తిగా చదివాక అసభ్యత లేకుండా, ఎక్కడా లైన్ దాటకుండా అన్ని వయసుల వాళ్లూ చూడగలిగేలా ఉందని తెలిసింది. ఈ కథలో ఇన్ఫెర్టిలిటీ అనే సెన్సిటివ్ ఇష్యూని ఎంటర్టైన్మెంట్తో మేళవించాం. మూడు భాగాలు ఫన్గా సాగి, చివర్లో మంచి ఎమోషన్, మెసేజ్తో ముగుస్తుంది.
– చైతన్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్ర చేశాను. ప్రతి ఉద్యోగి ఈ క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. ఈ రోల్ కోసం ఆరు కిలోల బరువు పెరిగాను. ప్రస్తుత కాలంలో ఇన్ఫెర్టిలిటీ సమస్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకులకు ఒక హోప్ ఇస్తుంది. చాందినీ చౌదరి కీలక పాత్రలో అద్భుతంగా చేశారు. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
– సునీల్ కశ్యప్ బిజీగా ఉండటంతో బీజీఎమ్ అజయ్ అరసాడ చేశారు. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. పాటలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేట్ రావడం, ప్రీమియర్ షోస్లో వచ్చిన స్పందన చాలా పాజిటివ్గా ఉంది.
– ఈ సినిమా తర్వాత కూడా శ్రీధర్ గారి బ్యానర్లోనే ‘సర్పంచ్’ అనే గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రం చేస్తున్నాను. అలాగే ‘మృత్యుంజయ మార్కండేయ’ అనే సోషియో-ఫాంటసీ ప్రాజెక్ట్కు కూడా సిద్ధమవుతున్నాను.


