టాలీవుడ్లో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత సినీ చరిత్రలో టాలీవుడ్ సత్తా చాటుతూ యావత్ సినీ ప్రేమికులను కట్టిపడేసిన చిత్రం ‘బాహుబలి’. మాగ్నమ్ ఓపస్ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన విజన్తో రూపొందించిన తీరు అద్భుతం. ఇక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన విధ్వంసం అందరికీ తెలిసిందే.
కాగా, బాహుబలి – ది బిగినింగ్ చిత్రం రిలీజ్ అయి నేటికి పది సంవత్సరాలు పూర్తయింది. పదేళ్ల బాహుబలి చిత్రాన్ని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఈ సినిమా చేసిన వండర్స్ను గుర్తుకు చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రంతో ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించిన బాహుబలి టీమ్ రీయూనియన్ అయ్యారు.
దర్శకుడు రాజమౌళి, నిర్మాతలతో పాటు ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, నాజర్, టెక్నికల్ టీమ్ అందరూ ఒకచోట కలిశారు. పదేళ్ల బాహుబలిని గుర్తుకు చేసుకుని ఈ సినిమా కోసం తాము పడ్డ కష్టాలు, వాటిని దూరం చేసిన సక్సెస్ను తలుచుకున్నారు. ఇలా ఈ సినిమా గురించి చాలా జ్ఞాపకాలను వారు పంచుకున్నారు. ఈ పదేళ్ల బాహుబలి రీయూనియన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.