సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత చేయనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. కోవిడ్ కారణంగా ఆలస్యమైన ఈ సినిమా లాక్ డౌన్ అనంతరం స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ అమెరికాలో షూటింగ్ చేయాల్సి ఉండటం, అక్కడ కూడ కోవిడ్ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో వీసా ప్రాసెస్ ఆలస్యమవుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ఆ పని మీదే ఉన్నారు. దీంతో మహేష్ బాబు కుటుంబంతో కలిసి దుబాయ్ హాలీడేకు వెళ్లారు.
తాజా సమాచారం మేరకు డిసెంబర్ నాటికి వీసా ప్రాసెసింగ్ పూర్తవుతుందని, జనవరి నుండి అమెరికా షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తోంది. సుమారు ఏడు నెలల నుండి షూటింగ్స్ లేకపోవడంతో మహేష్ సైతం ఎప్పుడెప్పుడు సెట్లోకి అడుగు పెడదామా అని ఎదురుచూస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లతో కలిసి మహేష్ బాబు స్యయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించనుంది.