మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్ సినిమా రంగం పై విసిరిన పంజా దెబ్బకు.. సినిమా థియేటర్స్, మల్టీపెక్స్ల తీరు మారబోతోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ అన్ని మూసేశారు. దేశవ్యాప్తంగా క్లోజ్ లో ఉన్న థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఓపెన్ అయినా కరోనా భయంతో జనం థియేటర్స్ వస్తారా.. ? వచ్చేలా అనేక జాగ్రత్తలు తీసుకోవడానికి హైదరాబాద్ థియటర్ల యజమానులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. థియేటర్ లో ఒక సీటు వదిలి మరో సీటులో కూర్చునే విధానాన్ని ప్లాన్ చేస్తున్నారు.
ముఖ్యంగా ప్రతి షో ముగియగానే అన్ని సీట్లను శానిటైజ్ చేసి ఎర్ర రిబ్బన్ పెట్టాలని.. దీనికి ఎక్కువ సమయం అయితే రోజుకు నాలుగు షోలకు బదులు మూడే ప్రదర్శించాలని అనుకుంటున్నారట. అలాగే పేపర్ టిక్కెట్లను ఎత్తివేసి, క్యూఆర్ కోడ్ తో టికెట్ను సెల్ఫోన్ కు పంపేలా ప్లాన్ చేయనున్నారు. అలాగే స్టాల్స్ వద్ద, బాత్ రూమ్ ల దగ్గర, భౌతికదూరం పాటించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న రెండురోజుల్లో నగరంలోని ఒక ప్రముఖ థియేటర్లో ఈ విధానాలను అమలు చేసి చూడాలని చూస్తున్నారు.
రెండు రోజుల కింద హైదరాబాద్ లోని దాదాపు వందమంది థియేటర్ల యజమానులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమస్యల పై చర్చించుకున్నారు. ప్రభుత్వం ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడానికి ముందే థియేటర్లలో వైరస్ నిరోధానికి తమంతట తామే కొన్ని చర్యలు తీసుకుని ప్రభుత్వ పెద్దలను కలిసి నివేదికను అందజేయాలని కూడా ప్లాన్ చేసుకున్నారు.