ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన ఔదార్యం చాటుకున్నారు. తన వద్ద వివిధ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందికి ముందు నెలలకు కూడా జీతం చెల్లించి వేశాడు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో వారు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
”జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నా వద్ద ఉన్న క్యాష్ బాలన్స్ ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్లో ఉద్యోగం చేసేవారికీ. నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశానని నటుడు ప్రకాష్ రాజ్ తెలిపాడు. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి ఆలోచించాను. కరోనా మహమ్మారితో పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. డైలీ వేజ్ లేబర్స్ కి సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇక్కడితో పూర్తి కాదు. నా శక్తి మేరకు చేస్తాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే, మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది..” అని ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.