వ్యక్తిగత సమస్యలు, కెరీర్ పరంగా వెనుకబడడం వంటి కారణాల వలన ఉదయ్ కిరణ్ 2014లో ఆత్మ హత్య చేసుకొని మరణించారు. అనేక హిట్ చిత్రాలతో తెలుగువారికి బాగా దగ్గరైన ఉదయ్ కిరణ్ అకాల మరణాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు. ఉదయ్ కిరణ్ మరణాన్ని తెలుగు ప్రజలు మర్చిపోగా…బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ అదే తరహాలో ఆత్మ హత్య చేసుకొని మరణించడంతో మళ్ళీ ఆయన పేరు తెరపైకి వచ్చింది.
కాగా ఉదయ్ కిరణ్ మరణం తరువాత విడుదల ఆగిపోయిన ఆయన చివరి చిత్రం విడుదల కానుంది. ‘చిత్రం చెప్పిన కథ’ పేరుతో తెరకెక్కిన ఈ మూవీని దర్శక నిర్మాతలు ఓ టి టి లో విడుదల చేయాలని భావిస్తున్నారు. కాగా ఈ మూవీ పట్ల ఉదయ్ కిరణ్ అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. భౌతికంగా దూరమైన తమ అభిమాన నటుడు చివరి మూవీ చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉదయ్ కిరణ్ మొదటి మూవీ చిత్రం కాగా ఆయన చివరి మూవీ చిత్రం చెప్పిన కథ కావడం విశేషం.