ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో భాగంగా సినీ పరిశ్రమతో ఈ సమావేశం జరిగింది. ఇక మరో సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రస్తుతం ఈ సమావేశాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలంటూ పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై కోరారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. సినీ పరిశ్రమ నుంచి నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు హాజరయ్యారు.
వారితో పాటు నటులు అక్కినేని అమల, రితేశ్ దేష్ముఖ్, జెనీలియా తో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్లో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. అంతేగాక, ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని సీఎం తెలిపారు. కేవలం స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించనుందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.
