నూతన నటీనటులు దిలీప్, శ్రావణి జంట హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా సినిమా “తొంగి తొంగి చూడమాకు చందమామ”. ఈ చిత్రంలో కుమర్ సాయి, రాజ్ బాలా, జెమినీ సురేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. “తొంగి తొంగి చూడమాకు చందమామ” చిత్రానికి ఆనంద్ కానుమోలు దర్శకత్వం వహించారు.
గురురాఘవేంద్ర సమర్పణలో హరివల్లభ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఎ. మోహన్ రెడ్డి నిర్మాత. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “తొంగి తొంగి చూడమాకు చందమామ” సినిమా యూఏ సర్టిఫికెట్ తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ – కోరుకున్న వాళ్లను దక్కించుకోవాలంటే ప్రేమించడం ఒక్కటే మార్గం. ప్రేమించడం వల్లే వారి విలువ కూడా తెలుస్తుందనే చెప్పే చిత్రమిది. యువతకు నచ్చే సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు చిత్ర కథలో ఉంటాయి. వినోదం, సందేశం రెండూ సినిమాలో చూపిస్తున్నాం. సెన్సార్ సభ్యులు కూడా సినిమా బాగుందంటూ అభినందించారు. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మా సినిమా టీజర్, సాంగ్స్ చూసి భారీగా చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకొచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ కి కృతజ్ఞతలు. త్వరలో ఆడియో, ట్రైలర్ రిలీజ్ చేసి డిసెంబర్ లో చిత్రాన్ని థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అని తెలిపారు.
ఇక ఈ చిత్రంలో అనంత్, కార్తీక్ అయినాల, అపర్ణ, స్నేహల్, మాధవిప్రసాద్, లావణ్య, మహేంద్రనాథ్, వింధ్య వాసిని రెడ్డి ఇతర పాత్రల్లో నటించగా ఈ చిత్రానికి ఎడిటింగ్ – ఈశ్వర్ 57, ఫైట్స్ – రియల్ సతీష్, కొరియోగ్రఫీ – శ్రీనివాస్ . కె , వినయ్, పాటలు – బాలాజీ, సంగీతం – హరి గౌర, కెమెరా – వివేక్ రఫీ. ఎస్.కె, నిర్మాత – ఎ. మోహన్ రెడ్డి, రచన, దర్శకత్వం – ఆనంద్ కానుమోలు అందిస్తున్నారు.