కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా ‘ఎస్డి కేరాఫ్ వెంచపల్లి’ ఫస్ట్ సింగిల్ లాంచ్ శ్రీ సాయి అమృత లక్ష్మి క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్, భాను ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై పాలిక్ దర్శకత్వంలో గోదారి భానుచందర్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఎస్డి కేరాఫ్ వెంచపల్లి’. శ్రీజిత్ లవన్, జీవా, సుమన్ శెట్టి, దివ్య, రాతేష్, అభిగ్యాన్, లక్కి, ఎస్.వింధ్యారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రఘురామ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ని కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా కళాతపస్వి కె.విశ్వనాథ్ మాట్లాడుతూ…‘‘తెలంగాణ పోరడు’ అనే పాట వినసొంపుగా ఉంది. నూతన తారాగణంతో దర్శకుడు పాలిక్ చేస్తోన్న ఈ ప్రయత్నం ఫలించాలి. యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు” అన్నారు. దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ…‘‘పట్టణాలు, పల్లెలో, గ్రామాల్లో ఇటీవల మేము విడుదల చేసిన ‘తెలంగాణ పోరడు’ సాంగ్ మారుమోగుతోంది. గోదారమ్మ పరవళ్లు తొక్కినట్టుగా రఘురామ్ గారు అందమైన బాణీ సమకూర్చగా దానికి సురేష్ గంగుల తెలంగాణ మట్టి పరిమళింపులాంటి చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. ఇంత మంచి పాటని గురువుగారు కళాతపస్వి, గొప్ప దర్శకుడైన కె.విశ్వనాథ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. స్వతహాగా నేను కొరియోగ్రాఫర్ని కావడంతో కె.విశ్వనాథ్గారి చిత్రాల్లోని పాటల నృత్వాలను ఎంతో మంది పిల్లలకు నేర్పించేవాణ్ని. ఇక నా మొదటి సినిమాలోని మొదటి పాటను వారు ఆవిష్కరించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా”అన్నారు.
నిర్మాత గోదారి భానుచందర్ మాట్లాడుతూ…‘‘నా మిత్రుడు పాలిక్ రఘురామ్ గారి దగ్గర నుంచి మంచి బాణీని తీసుకొని దానికి సురేష్ గంగులతో అర్థవంతమైన సాహిత్యాన్ని రాయించారు. అలాంటి పాటను కె.విశ్వనాథ్ గారితో లాంచ్ చేయడం శుభ సూచకంగా భావిస్తున్నాం. త్వరలో ఫైనల్ షెడ్యూల్ని అందమైన లొకేషన్స్లో చిత్రీకరించనున్నాం. ఎన్నో ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించి దర్శకుడు చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు” అన్నారు.